CM Revanth Reddy inaugurates Government Schools Breakfast scheme
* తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దడమే లక్ష్యం
* ఆరుట్ల గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది
అకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణ భవిష్యత్తు అద్దాల మేడల్లో లేదా రంగురంగుల గోడల్లో లేదని, తరగతి గదుల్లోనే ఉందని తమ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యా కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు.
ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు చేరడం ప్రభుత్వ విద్యపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం పెరుగుతుంది అని అన్నారు.
* ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డులు
ఒక ప్రభుత్వ పాఠశాలకు ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టే పరిస్థితి రావడం గొప్ప విషయమని, దీనికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలంటే ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు . మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని గుర్తు చేశారు.
* ఉన్నత స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎదగాలి
ప్రభుత్వ బడిలో చదివి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని, విద్యార్థులు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, అధికారులు, రాజకీయ నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు, విద్యా కిట్లు అందించే ప్రణాళికతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
