
* ముగిసిన హరీశ్రావు విచారణ
* కాళేశ్వరం విచారణ కమిషన్ కు సమాధానాలు వెల్లడి
* కేసీఆర్ అడిగినా తమ్మిడిహట్టి దగ్గర నిర్మాణానికి ఒప్పుకోలేదు
* సిడబ్ల్యూసీ లేఖలు కమిషన్కు అందించానన్న హరీశ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఈ విచారణ కొనసాగింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పలు ప్రశ్నలను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ (P.C Ghosh) అడగ్గా, హరీశ్రావు సమాధానాలు చెప్పారు. దాదాపు 40 నిమిషాల విచారణలో 20 ప్రశ్నలు అడిగారని, అన్నింటికీ నిజాలే చెప్పానని విచారణ అనంతరం మీడియాకు హరీశ్రావు వెల్లడించారు. కేసీఆర్ స్వయంగా అడిగినా తమ్మిడిహట్టి దగ్గర నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని తెలిపినట్లు పేర్కొన్నారు. సిడబ్ల్యూసీ లేఖలు కమిషన్కు అందించానన్నారు. అయితే, మాద్యమం సమస్య కారణంగా కమిషన్ విచారణలో భాగంగా కొన్ని సందర్భాల్లో జడ్జి అడిగిన ప్రశ్నలను హరీశ్ రావు అర్థం చేసుకోలేకపోయారని తెలిసింది. ముఖ్యంగా టెక్నికల్ అంశాలకు సంబంధించి ప్రశ్నించినప్పుడు అది అధికారులు చూసుకున్నారని మాత్రమే హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు.. వాటి సమాధానాలను పరిశీలిస్తే..
కమిషన్ : ప్రాజెక్టును తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు?
హరీశ్ రావు : కేంద్ర సర్వే సంస్థ వ్యాప్కోస్, టెక్నికల్ కమిటీ, హై పవర్ కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు మార్చాల్సి వచ్చింది. ప్రధానంగా మహారాష్ట్ర అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి గుడిగడ్డకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. 152 అడుగుల నుంచి 148 అడుగులకు మార్చితే.. నీటి లభ్యత ఉండదని.. సెంట్రల్ వాటర్ కమిషన్ సైతం స్పష్టం చేసింది.
కమిషన్ : కాళేశ్వరం కార్పొరేషన్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
హరీశ్ రావు : కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నిధుల విషయానికి సంబంధించి ఇబ్బందులు ఉండడంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
కమిషన్ : జీవో 115 మంత్రుల సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు?
హరీశ్ రావు : రైతులకు ఎక్కువ సంఖ్యలో నీళ్లు అందించడానికి అప్పటి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు ఈటల రాజేందర్, హరీష్ రావు ఉన్నారు.
కమిషన్ : ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును ఎలా తీరుస్తారని అనుకున్నారు..?
హరీశ్ రావు : ప్రాజెక్టు వల్ల కేవలం ఇరిగేషన్ మాత్రమే కాకుండా.. పరిశ్రమలకు నీళ్లు ఇవ్వడం, ప్రజలకు తాగునీటి అవసరాలు కూడా తీర్చాలని లక్ష్యంతో చేశాం. కోకోకోలా కంపెనీ నీటి అవసరాలు కూడా కాలేశ్వరం ద్వారానే తీర్చాలని భావించాం. కోవిడ్ వల్ల కొన్ని కంపెనీలు ప్రాజెక్టు పరిధిలో రాలేకపోయాయి.
కమిషన్ : కాళేశ్వరం బ్యారేజీల్లో ఎంత నీటిని నిల్వ చేయొచ్చు
హరీశ్ రావు : 140 టీఎంసీలు నిల్వ చేయొచ్చు.
కమిషన్ : కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణం ఏంటి..?
హరీశ్ రావు : లోన్స్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.
కమిషన్ : నిర్మాణ సంస్థలకు సైట్ ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు?
హరీశ్ రావు : సాధారణంగా అప్పటి పరిస్థితులు ఆధారంగా సైట్స్ కొంత డిలే అవుతాయి.
కమిషన్ : బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలని ఎవరు సూచించారు.
హరీశ్ రావు : అది టెక్నీకల్ విషయం, ఇంజనీర్లు తీసుకున్న నిర్ణయం.
కమిషన్ : ప్రాజెక్టుల లొకేషన్లు మార్చే అధికారం హై పవర్ కమిటీకి అధికారం ఉందా..?
హరీశ్ రావు : అప్పటి ప్రభుత్వం హై పవర్ కమిటీకి అన్ని అధికారాలు ఇచ్చింది.
కమిషన్ : కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయిందా? అయితే ఇంత చేశారు?
హరీశ్ రావు : కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు డిలే అయింది.
కమిషన్ : మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్గా నీళ్లు ఇవ్వొచ్చు ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందా..?
హరీశ్ రావు : డైరెక్ట్ గా నీళ్లు ఇవ్వడానికి సాధ్యం కాదని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది.
……………………………………………………….