
* సిట్ విచారణ అనంతరం గోనె ప్రకాశ్ రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తమ విచారణను ముమ్మరం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాపింగ్కు గురైన పలువురు నేతలను సిట్ అధికారులు వరుసగా విచారిస్తూ వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్కు గురైనట్లు గుర్తించిన అధికారులు, సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకావాలని ఆయనను కోరారు. సిట్ అధికారుల అభ్యర్థన మేరకు, గోనె ప్రకాశ్ రావు ఈ ఉదయం 10:30 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ ఆయన సిట్ అధికారుల ముందు హాజరై తన వాంగ్మూలాన్ని అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. గతంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు అంశం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, సొంత పార్టీ నేతలైన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు వంటి వారి ఫోన్లను కూడా అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని పేర్కొన్నారు. ఎలాగైనా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయం సాధించాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం విచక్షణారహితంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిరదని ఆయన మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ప్రపంచంలోనే మూడో అతిపెద్దదని గోనె ప్రకాశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ ఆరోపణలతో ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ ప్రకంపనలు మరింత తీవ్రమయ్యాయి. సిట్ దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
………………………………………..