
* యోగా జీవితంలో భాగం కావాలి
* యోగాకు వయసుతో సంబందం లేదు
* ఆరోగ్యంగా ఉంటేనే దేన్నైనా సాధించవచ్చు
* జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
ఆకేరు న్యూస్, జనగామ: యోగాతో మానసిక ప్రశాంతత, ఆరోగ్య పరిరక్షణ ఉంటుందని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక ధర్మకంచ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ చేతన్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇందుకోసం యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. జిల్లా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని యోగా ను ప్రతీ ఒక్కరు అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా, మండల స్థాయిలో వివిధ ప్రదేశాల్లో పాఠశాలలో, కార్యాలయల్లో నిర్వహించామన్నారు. నిత్య జీవితంలో ప్రతీ ఒక్కరు విధిగా యోగా ను అలవాటు చేసుకోవాలని, దానివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావన్నారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు, యోగాసనాల వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, రోగనిరోధక శక్తి కూడా పెంచుతుందన్నారు. శారీరక,ఆరోగ్య ప్రయోజనాలను అందించే యోగా అందరి జీవితం లో ఒక భాగం కావాలన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని, వయస్సు తో సంబంధం లేకుండ ప్రతీ ఒక్కరు యోగా కోసం రోజులో కొంత సమయం కేటాయించాలిసిన అవసరం తప్పకుండ ఉందన్నారు. ఈ కార్యక్రమం లో వివిధ శాఖలకు చెందిన అధికారులు, విద్యార్థులు, యువత, ప్రజలు పాల్గొన్నారు.
…………………………………………