ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
ఇరాన్-ఇరాక్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం దేశంలోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రభావం చూపనుంది. యుద్ధం కారణంగా పెట్రోల్ ఉత్పత్తులు, రవాణా, గ్యాస్ సరఫరా పై ప్రభావం పడడంతో వినియోగదారులకు పెను భారంగా మారనుంది. ప్రధానంగా మండల కేంద్రాలు, గ్రామాలలో గ్యాస్ ఆధారంగా నిర్వహించే హోటల్లు, దాబాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో డొమెస్టిక్ గ్యాస్ సరఫరా కు కొంత సడలింపు ఉన్నప్పటికీ కమర్షియల్ గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిపివేయడంతో రోజువారి వ్యాపారం నిర్వహించే హోటల్లు, ధాబాలు మూత పడుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ కొరతతో జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో పలు టీ స్టాల్స్, మిఠాయి బండార్, బేకరీ, దాబాలు మూసేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
* మూతపడ్డ దాబాలు
మండల కేంద్రంలో ఆర్ఆర్ బాబా, రెడ్డి మెస్, వేణు ధాబా, వినాయక దాబా, వజ్రా దాబా, హరిత ధాబా మెట్రో బేకరీ, తిన్నంత బిర్యాని (బిర్యానీ పాయింట్), రమ్య మెస్ తోపాటు మరికొన్ని హోటల్లు మరి కొన్ని ఉన్నాయి. గ్యాస్ దొరకక కట్టెల పైన వంటలు చేయలేక దాబాలు మూసేశారు.
* కార్మికులకు ఇబ్బందులే
దాబాలు, హోటల్లు మూసివేయడంతో రోజువారీగా పనిచేసే కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒరిస్సా సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు రోజువారి కూలీలుగా హోటల్, దాబాల్లో పనిచేస్తారు. గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో దాబాలు, హోటల్లు మూతపడి కార్మికులకు పని లేకుండా ఇబ్బందులు పడక తప్పడం లేదు.
