ఆకేరు న్యూస్, కమలాపూర్ :
నేటి నుంచి మూడు నెలల ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం అయ్యింది. పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా లబ్ధిదారులు ప్రతి నెలా రేషన్ షాపుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బంది పడకూడదనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన కోటాను ఒకేసారి పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పేద ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎండలు తీవ్రంగా ఉండటంతో , వచ్చే మూడు నెలల పాటు మండుటెండలో రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని వారు సంతోషపడుతున్నారు. రోజువారీ కూలీ పనులకు వెళ్లే వారు సైతం, ప్రతి నెలా రేషన్ కోసం పని మానుకోవాల్సిన అవసరం లేకపోవడంతో తమకు సమయం కలిసి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. గతంలో మూడు నెలల సరుకు కోసం మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి వచ్చేదని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి ప్రారంభమయ్యే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
