Bhagirath Maharshi Jayanti Celebrations Telangana
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన భగీరథ మహర్షి జయంతోత్సవాల్లో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
* రాజకీయాలకు అతీతంగా బీసీ ఐక్యత..
బడుగు, బలహీన వర్గాల హక్కుల విషయంలో రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా ఉన్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే కుల గణన (Caste Survey) పూర్తి చేసిందని, ఆ వివరాలను పారదర్శకంగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఈ గణాంకాల ఆధారంగానే బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
* సమస్యలపై స్పందన..
సగర వంశీయుల సమస్యలను కేవలం డిమాండ్లకే పరిమితం చేయకుండా, వాటిని పరిష్కరించుకున్నప్పుడే నిజమైన ‘భగీరథ ప్రయత్నం’ సఫలమవుతుందని ఆయన అన్నారు.
* ప్రత్యేక సమావేశం
సగర సంఘం ప్రతినిధులతో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, వారి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్పంచులుగా, మున్సిపల్ చైర్మన్లుగా రాజకీయాల్లో ఉన్న సగర సామాజికవర్గ నేతలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కేవలం ఉన్నత చదువుల ద్వారానే కుటుంబాలు ఆర్థికంగా ఎదగగలవని, సగర బిడ్డలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో పాటు ఎంపీ ఈటల రాజేందర్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమాయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు తదితరులు పాల్గొన్నారు.
