RBI credit card new rules
* 3 రోజులు లేటైనా నో పెనాల్టీ.. నో సిబిల్ ఎఫెక్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? బిల్లు చెల్లింపు తేదీ మర్చిపోయి భారీగా జరిమానాలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. క్రెడిట్ కార్డ్ నిబంధనలను సవరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులపై భారం పడకుండా బ్యాంకుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
* ఏమిటా 3 రోజుల వెసులుబాటు?
సాధారణంగా నిర్ణీత గడువు తేదీ (Due Date) ముగిసిన మరుక్షణమే బ్యాంకులు ఖాతాను ‘ఓవర్ డ్యూ’గా పరిగణించి పెనాల్టీలు వసూలు చేసేవి. కానీ ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం.. గడువు ముగిసిన తర్వాత కూడా వినియోగదారులకు 3 రోజుల ‘గ్రేస్ పీరియడ్’ (విండో కాలం) అందించాలి. అంటే డ్యూ డేట్ దాటిన మూడు రోజుల్లోపు గనుక మీరు బకాయిలు చెల్లిస్తే, దానిని ‘గత బకాయి’గా పరిగణించరు. దీనివల్ల వినియోగదారులకు అదనపు సమయం లభించడమే కాకుండా, అనవసరపు ఆర్థిక భారం తప్పుతుంది.
సిబిల్ స్కోర్పై ప్రభావం ఉండదు
సాధారణంగా బిల్లు చెల్లింపు ఒక్క రోజు ఆలస్యమైనా బ్యాంకులు ఆ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు నివేదించేవి. దీనివల్ల క్రెడిట్ స్కోర్ (CIBIL Score) పడిపోయి, భవిష్యత్తులో లోన్లు తీసుకోవడం కష్టమయ్యేది. అయితే కొత్త నిబంధన ప్రకారం, ఆ 3 రోజుల గ్రేస్ పీరియడ్లోపు చెల్లింపు పూర్తి చేస్తే మీ క్రెడిట్ స్కోర్పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. మీ క్రెడిట్ హిస్టరీ సురక్షితంగా ఉంటుంది.
* తగ్గనున్న పెనాల్టీ భారం…
గతంలో బ్యాంకులు మొత్తం బిల్లు మొత్తంపై జరిమానాలు విధించేవి. ఉదాహరణకు మీ బిల్లు రూ. 20,000 ఉండి, మీరు పొరపాటున రూ. 15,000 కట్టి రూ. 5,000 బ్యాలెన్స్ ఉంచితే.. పాత పద్ధతిలో మొత్తం రూ. 20,000పై పెనాల్టీ పడేది. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం, గడువు తర్వాత మీరు చెల్లించాల్సిన నికర బకాయి (Actual Outstanding Amount) పై మాత్రమే జరిమానా విధించాలి. ఇది సామాన్య మధ్యతరగతి వినియోగదారులకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు.
* గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం…
జరిమానా విధించడానికి 3 రోజుల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ, ఒకవేళ మీరు ఆ మూడు రోజుల్లో కూడా బిల్లు కట్టకపోతే మాత్రం.. ‘ఆలస్యమైన రోజుల’ లెక్కింపు అసలు గడువు తేదీ (Original Due Date) నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ 3 రోజులను చివరి నిమిషం వెసులుబాటుగా భావించి లోపే చెల్లింపు పూర్తి చేయడం ఉత్తమం.
ఈ నిర్ణయంతో బ్యాంకుల అడ్డగోలు వసూళ్లకు బ్రేక్ పడటమే కాకుండా, వినియోగదారులకు తమ ఆర్థిక క్రమశిక్షణను కాపాడుకునేందుకు గొప్ప అవకాశం లభించినట్లయింది.
