Allu Arjun Summons Case
ఆకేరు న్యూస్, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్తో పాటు మరో 18 మందికి కోర్టు నోటీసులు (సమన్స్) జారీ చేసింది. రాబోయే సోమవారం (జూన్ 22) వీరంతా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
* ఏ11గా అల్లు అర్జున్…
గతేడాది డిసెంబర్ 4న ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద భారీగా అభిమానులు ఎగబడ్డారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్తో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం ఇటీవల కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చగా.. హీరో అల్లు అర్జున్ను A11 (11వ నిందితుడు) గా ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
* సోమవారం విచారణకు హాజరుకావాల్సిందే…
పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిశీలించిన నాంపల్లి కోర్టు.. కేసు విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ సహా 19 మందికి సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం వీరంతా కోర్టుకు స్వయంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరవుతారా? లేక తన తరఫు న్యాయవాది ద్వారా మినహాయింపు కోరతారా అనేది టాలీవుడ్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
