TRSMA LEADERS Station Ghanpur CBSE Schools
* ట్రస్మా స్టేషన్ ఘన్ పూర్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
సీబీఎస్ఈ స్కూల్ స్టేషన్ ఘన్ పూర్ మండలంలో ఎలాంటి పాఠశాలలు లేవనే విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలని ట్రస్మా డివిజన్ కమిటీ అధ్యక్షులు ఉబ్బని మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు పెసరు సంజీవరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు సీకే జాన్ బన్నీలు కోరారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో రెండు మూడు పాఠశాలలో సీబీఎస్ఈ అనుమతులు లేకుండా ఉన్నట్లు ప్రచారం చేస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన పాఠశాలలు అడ్మిషన్ల కోసం సీబీఎస్ఈ, ఇద్దరు ఉంటే ఒకరు ఫ్రీ, డ్రెస్సులు, పుస్తకాలు ఫ్రీగా, ఉచిత రవాణా మొదలైన ప్రచారం చేస్తున్నారని అలాంటి పాఠశాలల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
దీనికి తోడు ప్రవేశ సమయంలో రూ.8 వేలతో అడ్మిషన్ పొందండి 10వ తరగతి వరకు కూడా అదే ఫీజు తీసుకుంటామని సాధ్యం కానీ హామీలు ఇస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇలాంటి హామీలు, ప్రలోభాలకు గురై విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా జాగ్రత్తపడాల్సిందిగా తల్లిదండ్రులకు సూచించారు.
గతంలో అక్షర పాఠశాల యాజమాన్యం ఇలాంటి ప్రకటనలు, హామీలు ఇచ్చి విద్యార్థులను పాఠశాల చేర్పించుకుని ఫీజులు వసూలు చేసుకున్న రెండు నెలలకే బోర్డు తిప్పేసి పారిపోయిన విషయాన్ని వారు గుర్తు చేశారు. సమావేశంలో డివిజన్ కమిటీ కోశాధికారి జార్జ్ బెన్నీ, సభ్యులు శ్రీనివాస్, జోసెఫ్, సతీష్ రెడ్డి, బంటి, కిరణ్ కుమార్, సరళ అరుణాచలం, రాజు, కవితా రాణి తదితరులు పాల్గొన్నారు.
