Telangana Congress New Guidelines
* తెలంగాణ లో కాంగ్రెస్ సరికొత్త నిర్ణయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు టీపీసీసీ (TPCC) కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమాల్లోనైనా సరే, నాయకుల చిత్రపటాలకు ఇకపై పాలాభిషేకాలు, జలాభిషేకాలు నిర్వహించరాదని పార్టీ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ మార్పులను తక్షణమే అమలు చేయనున్నట్లు టీపీసీసీ స్పష్టం చేసింది.
* ఆహార పదార్థాల వృథాకు నో.. సేవకే ప్రాధాన్యం..
సాధారణంగా అభిమానం పేరుతో లీటర్ల కొద్దీ పాలు వృథా చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకమని టీపీసీసీ పేర్కొంది. పాలాభిషేకాలు చేసి ఆహారాన్ని వృథా చేయడానికి బదులుగా, ఆ ఖర్చుతో పేదలకు ఆహార పంపిణీ చేయాలని, సమాజానికి మేలు చేసే సేవా కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేసింది.
* వృథా ఖర్చులకు స్వస్తి..
జనాల్లోకి వెళ్లేటప్పుడు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాయకుల మెప్పు కోసం నిరుపయోగమైన ఆర్భాటాలు, వృథా ఖర్చులు పక్కనబెట్టి, నిస్సహాయులు, నిరుపేదలకు అండగా నిలవడమే అసలైన సేవా దృక్పథమని అధిష్టానం ఉద్ఘాటించింది. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలని కోరింది.
