ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
కన్న తండ్రి చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్న ఓ విద్యార్థి 10వ తరగతి వార్షిక పరీక్ష రాసి తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన తాటికొండలో జరిగింది. వివరాలు లోకి వెళితే… జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ కు చెందిన దేవరాయ సాంబయ్య (47) కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. హైదరాబాదులో కొంతకాలం ఉన్న సాంబయ్య గత పది ఏళ్లుగా శివుని పల్లి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. పిల్లలిద్దర్నీ ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తూ తాను కారు డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొడుకు దేవర చరణ్ శివునిపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పదవ తరగతి చదువుతుండగా కూతురు 8వ తరగతి చదువుతోంది. భార్యా పిల్లల్ని పోషించుకుంటున్న సాంబయ్య ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై బుధవారం రాత్రి మృతి చెందాడు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్వగ్రామం తాటికొండ కు తరలించారు. అయితే 10వ తరగతి చదువుతున్న చరణ్ ప్రస్తుతం వార్షిక పరీక్షలు రాస్తున్నారు. గత నెల 13న మొదలైన వార్షిక పరీక్షలు ఈనెల 13 తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఫిజిక్స్ పరీక్ష రాయాల్సిన చరణ్ తండ్రి మృతితో పుట్టడు దుఃఖంలో మునిగిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, ఉపాధ్యాయులు, స్నేహితుల సూచన మేరకు గురువారం జరిగిన (వార్షిక) ఫిజిక్స్ పరీక్ష రాసి తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు తాటికొండకు వెళ్ళాడు. వార్షిక పరీక్ష రాసి అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చిన చరణ్ ను చూసి బంధువులు, కుటుంబ సభ్యులు బోరునగలపించారు.
