ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మోసాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగానే.. మోసపోవడానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది పరిస్థితి. మోసగాళ్లు విద్యావంతులను, ఉన్నత వర్గాలను, వైద్య నిపుణులను కూడా దోచుకుంటున్నారు. అధిక డబ్బు ఆశ చూపి దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్(Hyderabad)లో ఓ వైద్యురాలిని మోసం చేసిన కేటుగాళ్లు ఏకంగా.. కోటీ 50 లక్షలను దోచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం (Visakhapatnam) అరకులోయకు చెందిన పెందుర్తి శ్రీనివాస్, వనుము శ్రీనివాస్, కొర్రా బంగార్రాజుగా హైదరాబాద్కు చెందిన ప్రియాంక అనే వైద్యురాలిని సంప్రదించారు. తమ వద్ద రూ. 30 కోట్లు విలువ చేసే మహిమ గల చెంబు ఉందని, దాంట్లో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని నమ్మబలికారు. ఆమె కూడా వారి మాటలను నమ్మింది. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులకు వైద్యురాలు రూ. 1.50 కోట్లు ఇచ్చింది. డబ్బు రెట్టింపుపై ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం లేదు. ఆరు నెలల గడుస్తున్నా వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో, మోసపోయానని గ్రహించిన వైద్యురాలు ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2,42,400 నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
………………………………………………….
