
ఎమ్మెల్సీ కవిత
* లక్షా 75 వేల ఎకరాలను సీఎం కుదవబెట్టే ప్రయత్నం
* ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేత్రపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మరోవైపు కంచ గచ్చిబౌలి భూములను కుదువ పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వ అప్పులు, వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారని విమర్శించారు. టీజీఐఐసీలో 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని కుదువపెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రహస్య జీవో ఇచ్చారని ఆరోపించారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిస్తే ఎందుకు దాచారో సీఎం జవాబివ్వాలని డిమాండ్ చేశారు. లక్షా 75వేల ఎకరాలను తాకట్టు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని, తన వద్ద నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో చేసిన అప్పులకు కేవలం రూ. 80 వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం తిరిగి చెల్లించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నా. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలే చెబుతున్నా. పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని.. పార్టీలో నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. అది సరికాదని.. సమయం వస్తే అన్నీ బయటకు వస్తాయన్నారు.
——————