
* కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: నో డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేస్తూ పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులు మళ్లీ అదే తరగతిలో చదవాల్సి ఉంటుంది. విద్యాహక్కు చట్టం- 2019కు చేసిన సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు అందులో తెలుగు రాష్ట్రాలు మినహా, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని కేంద్రం పేర్కొంది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. పరీక్షల్లో విద్యార్థి పై తరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే.. మళ్లీ పరీక్ష రాసేందుకు కొంత సమయం ఇస్తారు. ఫలితాల ప్రకటన తేదీకి రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ రీ-ఎగ్జామ్లోనూ ఫెయిల్ అయితే.. సదరు విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది.
ప్రాథమికోన్నత విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థినీ బహిష్కరించరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోని అంశం గనక ఈ విషయంలో ఆయా రాష్టాల్రు నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికే 16 రాష్ట్రాలు దిల్లీ సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ రెండు తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేశాయని సదరు అధికారి పేర్కొన్నారు. హరియాణా, పుదుచ్చేరి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. మిగతా రాష్ట్రాలు మాత్రం ఈ విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు అధికారి తెలిపారు. నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్రం డిటెన్షన్ విధానంపై గతంలో రాష్టాల్ర నుంచి అభిప్రాయాలను కోరింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఇక్కడ ’నో డిటెన్షన్ విధానం’ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
……………………………….