* కరీంనగర్లో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
* 12 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో బస్సు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. వికారాబాద్ ఘోర బస్సు ప్రమాదం తర్వాత ఎక్కడో చోట కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్లో మరో బస్సు ప్రమాదం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం లేకపోవడం ఊరట ఇచ్చినప్పటికీ, 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా (Karimnagar District) మానకొండూరు మండల పరిధిలో నిజామాబాద్ నుంచి వరంగల్ (Warangal) వెళ్తున్న ఆర్టీసీ బస్సు సదాశివపల్లి వద్ద లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరైతే గాయపడ్డారో వారిని కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి 108 అంబులెన్స్లో తరలించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పూర్తి వివరాల కోసం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడ్డ వారి వివరాలు సేకరిస్తున్నారు.
………………………………………….
