
* మృతదేహాల అప్పగింతలో ఆలస్యం
* మార్చురిలో గాజర్ల రవి, అరుణ, అంజు మృతదేహాలు
* రంప చోడవరం ఏరియా హాస్పిటల్ బంధువుల పడిగాపులు
ఆకేరు న్యూస్, అమరావతి : మారెడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ ఉదయ్, రాష్ట్ర నాయకురాలు అరుణ, అంజుల మృత దేహాల కోసం బంధువులు ఎదురు చూస్తున్నారు. ఎన్ కౌంటర్ లో తమ బంధువులు చనిపోయారని నిర్దారించుకున్న బంధువులు మృతదేహాల కోసం హుటాహుటిన రంప చోడవరం చేరుకున్నారు. వైద్యుల కొరత వల్ల వెంటనే పోస్ట్ మార్టం పూర్తి చేయలేక పోతున్నామని అధికారులు చెప్పారంటున్నారు. మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందిన వారి మృత దేహాలు 48 గంటలు పూర్తి అయిన తర్వాత కూడా అంత్య క్రియలు చేసుకునే అవకాశం కల్పించకపోవడం ఏంటని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మృత దేహాలను అప్పగించడంలో ఆలస్యం చేస్తోందని ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్ట్ నేత గణేశ్ మృత దేహం వరంగల్ కు తరలించేందుకు సోదరుడు గాజర్ల అశోక్, అజాద్ కుమారుడు నవీన్ తదితరులు రంప చోడవరం హాస్పిటల్ కు చేరుకున్నారు. వీరితో పాటు బంధు మిత్రుల సంఘం నేతలు పద్మకుమారి, అంజమ్మ, ఏపీసీఎల్ సీ నేత చిట్టి బాబు తదితరులు ఆస్పత్రి వద్ద ఉన్నారు. కాగా గురువారం రాత్రి పోస్ట్ మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగిస్తామని రంపచోడవరం ఏరియా ఆస్పత్రి అధికారులు చెప్పారని గాజర్ల రవి బంధువులు తెలిపారు..
————————-