
* కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన సీసీఎల్ఏ కమిషనర్
* పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు
* ఈ నెల 28వ తేదీ వరకు వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశం
హైదరాబాద్, ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి: గ్రామ రెవెన్యూ అధికారులుగా పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతనంగా రూపొందించిన భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా గ్రామ స్థాయి రెవెన్యూ అధికారుల నియామకానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన కసరత్తును దాదాపుగా పూర్తి చేసిన ప్రభుత్వం తాజగా పూర్వ, వీఆర్ఓ, వీఆర్ఏలకు ఆప్షన్లు ఇస్తూ సీసీఎల్ఏ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వీఆర్ఓలను, వీఆర్ఏలను ఇతర శాఖలలో మెర్జ్ చేశారు. అయితే ప్రస్తుతం ఇతర శాఖలలో ఉన్న వీఆర్ఓలు, వీఆర్ఏలు రెవెన్యూ శాఖలోకి బలవంతంగా తీసుకురాకుండా, వచ్చేందుకు సుముఖంగా ఉన్న వారినే విలేజ్ లేవల్ అధికారులుగా తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచనా ప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఇందులో భాగంగా వీఆర్ఓ, వీఆర్ఏలకు గూగుల్ ఫామ్స్ లో వివరాలను నమోదు చేయాలని, జిల్లాల వారిగా కలెక్టర్లు ఈ వివరాలను సేకరించి 2024 డిసెంబర్ 28వ తేదీలోపు పంపాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) ప్రతినిధులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం పునరుద్దరించడం వలన రెవెన్యూ వ్యవస్థకు పూర్వ వైభవం రావడంతో పాటు రైతులకు గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అయితే వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థ రద్దయిన తర్వాత ఇతర శాఖలలో వీరు పని చేస్తున్నారు. అయితే ఆ సర్వీసును పరిగణలోకి తీసుకుంటారా ? లేదా అనే సందిగ్దం వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి వ్యక్తం అవుతుంది.
…………………………………………………