
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* కామన్వెల్త్ ఆర్బిట్రేషన్ – మీడియేషన్ సదస్సు 2024లో పాల్గొన్న సీఎం
ఆకేరున్యూస్, హైదరాబాద్: సామాన్యులకు, చిన్న సంస్థలకు కూడా ఆర్బిట్రేషన్ – మీడియేషన్ సేవలు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM REVANTHREDDY) అన్నారు. హైదరాబాద్లో ప్రారంభమైన కామన్వెల్త్ ఆర్బిట్రేషన్ – మీడియేషన్ సదస్సు 2024 లో పాల్గొని ప్రసంగించారు. మధ్యవర్తిత్వం నెరపడం ద్వారా సమస్యల పరిష్కారానికి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి అభినందించారు. చర్చలు, సంప్రదింపులు, మధ్యవర్తిత్వం వల్ల వివాదాలు వీలైనంత తొందరగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని అన్నారు. అందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ సేవలు గ్లోబల్ ఇన్వెస్టర్స్, పెద్ద పారిశ్రామిక వేత్తలకే పరిమితం కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులోకి రావాలని కోరారు.
ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ మూలస్తంభమని, అయితే భారీ సంఖ్యలో పేరుకుపోతున్న పెండిరగ్ కేసులు న్యాయవ్యవస్థకు సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెండిరగ్ కేసుల భారాన్ని తగ్గించి వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమన్నారు. లండన్, సింగపూర్ తర్వాత ఆర్బిట్రేషన్ మ్యాప్లో హైదరాబాద్ నగరం ఉండటం గర్వకారణమని అన్నారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త ప్రణాళికలతో హైదరాబాద్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతోందని, సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ పరిశ్రమలకు హైదరాబాద్ పవర్ హబ్గా ప్రపంచ గుర్తింపు పొందిందన్నారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రధాన ప్రసంగం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏహెచ్ఎండీ నవాజ్, కామన్వెల్త్ లాయర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ డాక్టర్ పీటర్ డి.మేనార్డ్ కేసీతో పాటు న్యాయ రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు సదస్సుకు హాజరయ్యారు.
…………………………………………………