
– బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు
– హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితెల ప్రణవ్
ఆకేరు న్యూస్,కమలాపూర్ : గత అసెంబ్లీ ఎలక్షన్లల్లో తాను ఇచ్చిన మాట ప్రకారం కాసింపల్లిలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ అన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలోనీ కాసింపల్లిలో తొమ్మిది మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను గురువారం వొడితెల ప్రణవ్ అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మంత్రులుగా,మాజీ విప్ గా పనిచేసి, కాసింపల్లి గ్రామాన్ని పట్టించుకున్న వాళ్లే లేరని అన్నారు.బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 3000, కమలాపూర్ మండలంలో 850 కొత్త రేషన్ కార్డులు ప్రజా పాలనలో ఇచ్చామన్నారు. పేదవాళ్లు మూడు పూటలా సన్న బియ్యంతో అన్నం తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందిస్తున్నారని, ఉచిత బస్సు, ఉచిత కరెంటు, రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేసామన్నారు. ఈ సందర్భంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రణవ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం పైలెట్ ప్రాజెక్టు గ్రామమైన దేశరాజ్ పల్లిలో 150 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణం ఎలా జరుగుతుంది,డబ్బులు సకాలంలో పడుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ ,డైరెక్టర్లు,కమలాపూర్ మండల నాయకులు,సీనియర్ నాయకులు,యూత్ నాయకులు,గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
……………………………………………….