
* ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరున్యూస్, హన్మకొండ: మహనీయుడు, దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో స్వాతంత్య్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి ఉత్సవాన్ని షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిమాట్లాడుతూ దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ చరిత్రను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు బాబూ జగ్జీవన్ రామ్ మంత్రి పదవులను నిర్వర్తించారని అన్నారు. ఆనాటి కుల వివక్షపై పోరాటం చేసిన గొప్ప చరిత్ర వారిదని పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్ రామ్, అంబేద్కర్ వంటి మహనీయుల జీవితాలు, చేసిన త్యాగాలు ఎంతో గొప్పవని అన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్, అంబేద్కర్ సమాజ నిర్మాణానికి అందించిన సేవలను, త్యాగాలు, పోరాటాల స్ఫూర్తి ని భావితరాలకు అందించినప్పుడే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నెలకొల్పడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు కు స్థల పరిశీలన కోసం కమిటీ కృషి చేయాలన్నారు. కమిటీ నిర్ణయం మేరకు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటుకు త్వరగా చర్యలు తీసుకుంటామన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ మహనీయుల త్యాగాల స్ఫూర్తితోనే తాను ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. మహనీయుల త్యాగాలు, వారు అందించిన స్ఫూర్తి గురించి తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ తాను జీవించినంత కాలం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు. గొప్ప మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. తన జీవిత కాలంలో ఎవరికీ కూడా తలొగ్గి పనిచేయని గొప్ప వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ అన్నారు. తాను ఐపీఎస్ స్థాయికి ఎదగడానికి మహనీయులు కృషి వల్లనేనని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులు, యువత మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ ఒక చిన్న కుటుంబం నుండి దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వపరంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందించే విధంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. నైపుణ్యాలు పెంపొందించే విధంగా నైపుణ్య శిక్షణభివృద్ధి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, జిల్లాలోని పరకాల నియోజకవర్గ పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎస్ బి ఐ అర్సెటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందని, అదేవిధంగా స్టెప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, టాస్క్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందన్నారు. దీంతో పాటు ఇప్పుడు మరొక టాస్క్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నామని అన్నారు. వీటి ద్వారా చాలా జాబ్స్ కోసం కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసేలా అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. నైపుణ్యాలు పెంపొందించే అంశంపై ఎక్కువ అవేర్నెస్ కల్పించాలని కోరారు. విద్యార్థులు యువత చదువులతోపాటు సమాజంలో ఏం జరుగుతుందనేది తెలుసుకునేందుకు ప్రతిరోజు న్యూస్ పేపర్స్ చదవాలని, తద్వారా సమాజం పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. దేశానికి సమాజానికి సేవలందించిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకొని, భవిష్యత్తులో అంత పెద్ద స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
…………………………………………….