*కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం హుజరాబాద్ శివారులోని ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. 6 గ్యారెంటీలను అమలు చేశామని నిరూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, లేనిపక్షంలో రేవంత్ రెడ్డి సీఎం పదవిని వదులుకుంటారా అని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డికి ఏకంగా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని ఎద్దేవా చేశారు.మహారాష్ట్ర, హర్యానాలో ఇదే తరహా అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ఓడిపోయిందని, ఇప్పుడు అవే అబద్ధాలను కేరళకు ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. కేరళ మీడియా వాస్తవాలు తెలుసుకోవాలంటే తెలంగాణలోని రైతులు, యువతను నేరుగా కలిసి మాట్లాడాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
