
* ఎమ్మెల్సీ కవిత
* బీఆర్ఎస్ నాయకుడు లక్కినేని సురేందర్ను ఖమ్మం జైలులో పరామర్శించిన కవిత
ఆకేరున్యూస్, ఖమ్మం: బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామనడం దారుణమని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.శనివారం నాడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రంలో బీసీలు 46 శాతం ఉన్నారని, రీ సర్వే చేయడంతో మరో 1.5 లేదా 2 శాతం బీసీల జనాభా పెరుగుతుందని తెలిపారు. అంటే మొత్తం బీసీల జనాభా దాదాపు 48 శాతం ఉంటుందని అంచనా వేశారు. 48 శాతం బీసీలు ఉంటే… ఏ ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారు ? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఈ మూడు రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క అంశంపై అయినా ఎవరైనా కోర్టుకు వెళ్తే మొత్తం బిల్లు చెల్లకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మూడు రంగాలకు సంబంధించి వేర్వేరు బిల్లులను పెట్టాలని డిమాండ్ చేశారు. ముస్లీంలు, బీసీలకు కలిపి మొత్తం 56 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. రిజర్వేషన్ల విషయంలో హిందువులు, ముస్లీంలకు మధ్య బీజేపీ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ముస్లీంల జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు కల్పించాలని, ముస్లీంల పేరు చెప్పి ఆయా వర్గాల మధ్య పంచాయతీ పెట్టవద్దని సూచించారు. గ్రామాల వారీగా ఏ కులంలో ఎంత జనాభా ఉందో ప్రభుత్వం బయటపెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఇప్పటి వరకు ప్రభుత్వం బయపెట్టలేదని, దాన్ని కూడా వెంటనే బహీర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా లెక్కలు సరైనవా కావా అన్నది ప్రజలు తేల్చుకోగలుగుతారని తెలిపారు. సర్వేలో పాల్గొని వారికి మరోసారి అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, రీ సర్వేకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని, టోల్ ఫ్రీ నెంబరులో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.బీఆర్ఎస్ పార్టీ బీసీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని, అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో బీసీలకు 51 శాతం అవకాశాలు కల్పిస్తున్నదని గుర్తు చేశారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేలిన జనాభా ప్రకారం నిధులు ఖర్చు చేసుకున్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ ఉంటే అభివృద్ధిలో భారత్ ఎప్పుడో అమెరికాను దాటిపోయేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ జాగృతి సంస్థ బీసీలకు న్యాయం కోసం పోరాటం చేస్తుందని, సామాజిక దృక్పథంతో పనిచేస్తున్న సంస్థ తెలంగాణ జాగృతి అని చెప్పారు. జాగృతి పోరాటాల వల్లనే అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, బతుకమ్మ పండగకు రాష్ట్ర హోదా సాధ్యమయ్యిందని గుర్తు చేశారు.అక్రమ కేసులకు తలొగ్గేదే లేదు.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించిన బీఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్ ను ఖమ్మం జైలులో శనివారం నాడు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది..
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. అక్రమ కేసులతో కేసిఆర్ సైన్యాన్ని కట్టడి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని, కానీ కెసిఆర్ ని, కెసిఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరికి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా తమను ఆపలేరని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్ని, మోసాలన్నీ ప్రజల మనసుల్లోకి వెళ్లిపోయాయని, రైతులు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయని తెలిపారు. 14 నెలల పాలనలో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అందరికీ తెలిసిపోయిందని, ఆ భయంతోనే ఎవరిని పడితే వాళ్లను కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని చెప్పారు. గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు సురేందర్ పై అక్రమ కేసు నమోదు చేసి జైలు పంపారని, ప్రభుత్వం నడపడం చేతగాక, పథకాలు అందించడం చేతకాక వైఫల్యాలను కప్పిపెట్టుకుంటామంటే కుదరదని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంట పడుతూనే ఉంటామ, అక్రమ కేసులకు తలొగ్గేదే లేదని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు.
…………………………………………….