
* వచ్చే నెలలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల
ఆకేరున్యూస్,: దేశవ్యాప్తంగా సుమారు 10కోట్ల మంది రైతులకు వచ్చే నెలలో భారీ శుభవార్త వినిపించనుంది మోదీ సర్కార్. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2025 జూన్ నాటికి రూ. 2,000 అన్నదాతల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు అందుతున్న 20వ విడత ఆర్థిక సహాయం ఇది. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం. అయితే దీనికి గురించి ప్రభుత్వం ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చివరి విడత డబ్బు రూ. 2000 ను ప్రధాన మంత్రి మోదీ 2025 ఫిబ్రవరి 24న బీహార్ లోని భాగల్ పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరింది. తర్వాత ఇన్ స్టాల్ మెంట్ అయిన రూ. 2,000 అకౌంట్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈ కేవైసీని పూర్తి చేయాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్లో కూడా ఈ రూల్ పాటించాలని స్పష్టంగా చెప్పారు. ఈ కేవైసీ పూర్తి చేయనట్లయితే రూ. 2,000 మొత్తం రైతుల అకౌంట్లో జమ కాదు. అంతేకాదు రైతులు తమ భూమి రికార్డులు సరి చూసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు అకౌంట్స్ ఆధార్ కార్డులతో లింక్ అయి ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఈ ముఖ్యమైన పనులు పూర్తవ్వకుంటే రావాల్సిన డబ్బులు అకౌంట్లో ఆగిపోతాయి. రైతులు తమ ఇళ్ల నుంచే ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు. హోంపేజీలో కనిపించే ఈ కేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. సెర్చ్ పై క్లిక్ చేసి ఆ తర్వాత ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే ఈ కేవైసీ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది.
………………………………………