
– ప్రతీ వ్యక్తీ అన్ని సార్లు చేయవచ్చు
– దానం చేసిన 21 రోజుల్లోనే కొత్త రక్తం
– దాతల కోసం బాధితుల ఎదురుచూపులు
– నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
‘రక్తదానం చేయండి.. ప్రాణాలను కాపాడండి..’ అని బాధితులు వేడుకుంటున్నా చాలా మంది రక్తదానానికి ముందుకు రావడం లేదు. రక్తం కొరతతో బాధితులు అల్లాడుతున్నారు. రోగి సహాయకులు రక్తం కోసం ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ప్రజల్లో రక్తదానంపై అవగాహన లేమితో వెనుకడుగు వేస్తున్నారు. అది చాలా మంది ప్రాణసంకటంగా మారుతోంది. ఉదాహరణకు తెలంగాణలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏడాదికి దాదాపు 4.10 లక్షల యూనిట్ల రక్తం అవసరం ఉండగా, కేవలం 2.80 లక్షల యూనిట్ల మేరకు మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఈక్రమంలో రక్తదానంపై అవగాహన కలిగించేందుకు వైద్యులు, అధికారులు కృషి చేస్తున్నారు.
మీకో విషయం తెలుసా..
ప్రతీ వ్యక్తి తన జీవితంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చునని వైద్యులు పేర్కొంటున్నారు. పురుషులు మూడు నెలలకు ఒకసారి, మహిళలు ఆరు మాసాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని అవగాహన కలిగిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు వారు రక్తదానం చేయవచ్చునని వివరిస్తున్నారు. రక్తదానం చేసిన 21 రోజుల్లోనే మళ్లీ కొత్తరక్తం సమకూరుతుందని, ఏమాత్రం సందేహం అవసరం లేదని సూచిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే రక్తం ఎవరి నుంచి పడితే వారి నుంచి తీసుకోరు. కొవిడ్, ఇతర వైరస్లు, హెపటైటిస్ బి, సి, హెచ్ఐవీ, రక్తపోటు అధికంగా ఉన్న వారి నుంచి రక్తాన్ని తీసుకోరు.
రక్తదానం చేయండి ప్లీజ్
రక్తం కొరత కారణంగా ఎవరైనా బంధువులు, కుటుంబ సభ్యులు రక్తదానం చేసేందుకు ముందుకు వస్తేనే లేదా బయటి నుంచి తెస్తేనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి రక్తం ఎక్కించే పరిస్థితులు ఏర్పడ్డాయి. తలసీమియా-సికిల్ సెల్ సొసైటీలో నాలుగు వేల మందికిపైగా బాధితులున్నారు. నెలకు 2వేల యూనిట్లు రక్తం అవసరమవుతుంది. కానీ అందులో సగం కూడా లభ్యం కావడం లేదు. ఎంఎన్జే కేన్సర్ ఇనిస్టిట్యూట్కు రోజూ 20 యూనిట్లకు మించి రక్తం రోగులకు తప్పనిసరి అవుతోంది. బ్లడ్ కేన్సర్ రోగులు, కేన్సర్ బాధిత పిల్లలకు ప్లేట్లెట్స్ తక్కువ అవుతుండడంతో వారికి రక్తం ఎక్కించడం ప్రధానం. బాధితులకు 20 నుంచి 30 శాతం మేరకు మాత్రమే రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే రక్తదానం చేయండి ప్లీజ్.. అని వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు.
…………………………………………………………..