* ఏబీఎన్ చానల్ను బహిష్కరించిన బీఆర్ఎస్
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ను బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 23న సదరు ఛానెల్లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు పట్ల ఆ ఛానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరును పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇకపై అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఏబీఎన్ ఛానల్ ప్రతినిధులను అనుమతించకూడదని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. గెట్ ఔట్ ఫ్రం మై చానల్ అని సదరు టీవీ చానల్ వ్యాఖ్యాత అనడం కనీస పాత్రికేయ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. డిబేట్లకు పిలిచిన అతిథి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆంధ్రజ్యోతి ఛానల్ను బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని, విలువలను కాపాడాల్సిన మీడియా సంస్థలు ఈ తరహా తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని బీఆరఎస్ స్పష్టం చేసింది. ఇకపై కూడా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని పార్టీ హెచ్చరించింది.

………………………………………………………
