
* రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ చేపట్టాలా వద్దా..
* నా ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటారా?
* నేను తండ్రి పేరు చెప్పుకుని ఇక్కడకు రాలేదు
* ఎలాంటి క్రూర మృగాలనైనా బోనులో బంధించే శక్తి నా సభకు, సభ్యులకు ఉంది..
* కడుపుకట్టుకుని మొదటి ఏడాదిలోనే రుణమాఫీ చేశాం
* అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రైతు భరోసాపై తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి..(Cm Revanthreddy) ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు విధ్వంసకారులుగా, ఆర్థిక ఉగ్రవాదులుగా తయారు అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్(Kodangal)లో 1300 ఎకరాలు భూసేకరణ చేస్తుంటే.. రాద్దాంతం చేస్తున్నారని, అక్కడి యువకులకు ఉపాధి కల్పిస్తుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు. మూసీ ప్రాజెక్టు వద్దంటారు.. పరిశ్రమలు వద్దంటారు.. మెట్రో విస్తరణ వద్దంటారు.. అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రీజినల్ రింగ్ రోడ్డు(Reginal Ringroad), ఫ్యూచర్ సిటీ(Future City), మెట్రో(Metro) విస్తరణ చేపట్టాలా వద్దా.. అన్నారు. ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదాలను ఎంత కాలం భరించాలని పేర్కొన్నారు.
నా ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారు.. ఎంత బాధ్యతగా ఉండాలని, ఏడాది కాకుండానే మాపై విమర్శలు చేస్తారా? అని రేవంత్ అన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా.. నల్గొండ ప్రజలను అడుగుదామని తెలిపారు. జిల్లా స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానని, తండ్రి పేరు చెప్పుకుని ఇక్కడకు రాలేదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు కేవలం దొంగలకు సంచెలు మోసేవాళ్లని విమర్శించారు. బీఆర్ఎస్(Brs) లో వెనుక కూర్చున్న నేతలు కొందరు నాకు కావాల్సిన వాళ్లే అని, అయినా అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని తెలిపారు. ఎలాంటి క్రూర మృగాలనైనా బోనులో బంధించే శక్తి నా సభకు, సభ్యులకు ఉందని రేవంత్ తెలిపారు. తాను ఎవరినైనా కలుస్తానని, 24 గంటలూ తెలంగాణ కోసం పనిచేస్తానని వెల్లడించారు. కడుపుకట్టుకుని మొదటి ఏడాదిలోనే రుణమాఫీ చేశామని వివరించారు.
……………………………………………