
* మాజీ ఎంపి వినోద్ కుమార్
ఆకేరున్యూస్, హన్మకొండ: హనుమకొండలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని మాజీ ఎంపి వినోద్ కుమార్ అన్నారు. సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ నేతలు మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎల్కతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభ కొత్త తరానికి కొత్త ఆలోచనలు కలిగించే వేదికగా మారుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలిపిన ఘనత బీఆర్ఎస్దే అని పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్పై విమర్శలు చేశాయని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటికన్నా ప్రత్యేకమని అన్నారు. మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, 25 వసంతాల పండుగకు లక్షలాది మంది ప్రజలు హాజరుకానున్నారని, ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుందని చెప్పారు. కేసీఆర్ స్పెషల్ ఆదేశాల మేరకు సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ 25 వసంతాల పండుగను వరంగల్లో జరపడం గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల వసతులు అందించాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఈ సభ కోసం విశాల స్థలాన్ని కేటాయించామని, సభ నిర్వహణ కోసం రైతులు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సభతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని నేతలు అభిప్రాయపడ్డారు.
…………………………………..