
* జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
ఆకేరున్యూస్, జనగామ : బడి ఈడు పిల్లలు బడిబాట పట్టాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో శుక్రవారం జరిగిన బడిబాట ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ, ప్రి ప్రైమరి పాఠశాలను సందర్శించారు. ఈ విద్యా సంవత్సరం నుండి అంగన్వాడీ కేంద్రంలో కూడా స్కూల్ ప్రారంభానికి క ముందు బడి గంట కొట్టాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ స్వయం గా బడి గంట కొట్టగా పిల్లలు లోనికి వెళ్లారు. అంగన్వాడీ కేంద్రంలో ఎగ్ బిర్యానీ నీ చిన్నారులకు, వారి తల్లులకు, గర్భిణీలకు కలెక్టర్ వడ్డించి తాను కూడా వారితో కలిసి భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ డిఎస్ వెంకన్న, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఫ్లోరెన్స్, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంఈఓ కొమరయ్య, పిహెచ్సి డాక్టర్ రూబీన, సంధ్యారాణి, సుజాత, కుమారస్వామి అంగన్వాడీ టీచర్లు, వివోలు తదితరులు పాల్గొన్నారు.
సామూహిక అక్షరాభ్యాసం చేపించిన కలెక్టర్..
చిన్నారులకు చేస్తున్న విద్యాబోధనలో ఉపాధ్యాయులు పట్టు సాధించాలని, నాణ్యమైన విద్యపై ఉపాధ్యాయుల దృష్టి పెట్టాలని, ఉపాధ్యాయుల బోధన పటిమ విద్యార్థులను ఆకర్షింప చేసే విధంగా ఉండాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్నతో కలిసి సందర్శించారు. పాఠశాలలోని గదులపై బొమ్మల చిత్రీకరణను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థుల కు చేపడుతున్న బోధన పరిశీలించారు. వాటికి సరైన సమాధానాలు ఇవ్వడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కొత్తగా చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి వివరిస్తూ గతంలో 48 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 98 విద్యార్థులతో ఉందని మరింత శాతం నమోదుకు విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం కూడా లభిస్తున్నదని వివరించారు. అనంతరం బడిబాట కోసం కృషి చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ కొనియాడారు. ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అన్ని సౌకర్యాలతో విద్యను అందిస్తుందన్నారు. పాఠశాల ఆవరణ పరిశీలిస్తూ ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామని మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా నిర్మిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు అంచనాలు రూపొందించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట విద్యాశాఖ అధికారి బోజన్న, మండల విద్యాశాఖ అధికారి రఘునందన్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇతర విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………….