
* స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరున్యూస్ స్టేషన్ ఘన్పూర్ : స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ పార్టీ, ఏ ప్రభుత్వం తీసుకొని సాహసోపేత నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారని అన్నారు. బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ గారికి పంపించినట్లు తెలిపారు. బిసిలపై ప్రేమ ఓలకబోసే పార్టీలు బిసి రిజర్వేషన్లకు మద్దత్తు తెలపాలని కోరారు. బిఆర్ఎస్, బీజేపీ పార్టీలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలని, ఎవరైనా కోర్టుకు వెళ్లినా కేసులు ఉపసంహారించుకోవాలని కోరారు. జనాభా ప్రాతిపదికన అవకాశాలు రావాలని, అనవసరపు మెలికలు పెట్టి బిసిల అవకాశలను దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇచ్చిన హామీల మేరకు పనిచేశాను
ఎన్నికల మందు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అన్ని నెరవేర్చానని కడియం తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం జనవరిలోనే మున్సిపాలిటీ చేశానని, మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్లు మంజూరు తీసుకువచ్చానని వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో ఎక్కువ నిధులు మనకే వచ్చాయని తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయ భవనం, టౌన్ హల్, ఇంటిగ్రెటెడ్ మార్కెట్, సిసి రోడ్లు, డ్రైన్లు, రోడ్డు వెడల్పు వంటి పనులకు 50కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఈ పనులు అన్నింటిని ఏడాదిలో పూర్తి చేస్తానని వీటితో పాటు 100పడకల అస్పత్రి, డివిజనల్ ఆఫీస్, డిగ్రీ కళాశాల ఏర్పాటుతో ఘనపూర్ మున్సిపాలిటీ రూపు రేఖలు మారుతాయని పేర్కొన్నారు. దేవాదుల 3వ దశ ప్యాకేజీ 6 పనులను కాంట్రాక్టర్లు చేయలేమని వదిలేసారని దీంతో నాలుగు నియోజకవర్గాల పరిధిలో 78వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్న ఈ పనులను పూర్తి చేయాలనీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్ళగానే వెంటనే సవరించిన అంచనాలతో 1001 కోట్ల మంజూరు చేశారని తెలిపారు. దీని ద్వారా జఫర్ గడ్ మండలంలో ఉప్పుగల్ చెరువు, జఫర్ గడ్ పెద్ద చెరువును రిజర్వాయర్ గా చేసుకోబోతున్నామని, ఒక్క జఫర్ గడ్ మండలంలోనే 10వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. ఏడాది కాలంలో దేవాదుల పెండింగ్ పనులు, గండి రామారం కుడి కాలువ మరియు లిఫ్ట్ పనులను పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జరుగుతుందని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాని వెల్లడించారు. పనిలేని వారి మాటలు నేను పట్టించుకోనని, నా లక్ష్యం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం మాత్రమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ దేవస్థాన కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ కర్ణాకర్ రావు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
………………………………………………………………………….