
* కరీంనగర్ తిరుపతి రైలు వారానికి 4సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటా..
* కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ఆకేరున్యూస్, కరీంనగర్: తమ ప్రభుత్వ హయాంలో రైల్వే స్టేషన్లు అబివృద్ధి చెందాయనడానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణే నిదర్శనమని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వర్చువల్గా ప్రారంభించారు. అందులో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంజయ్ తోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, అతి త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను సైతం అమృత్ భారత్ పథకంలో చేర్చి ఆధునీకరిస్తా మన్నారు. కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61 కి.మీల నూతన రైల్వే లేన్ నిర్మాణంపై సర్వే పూర్తి చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా తయారు చేశామన్నారు. ఈ నూతన లేన్ నిర్మాణానికి రూ.1480 కోట్ల వ్యయం అవుతుందని డీపీఆర్ లో పేర్కొన్నారని, దీనిపై అతి త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కరీంనగర్ నుండి తిరుపతికి ప్రతిరోజు రైలు నడపాలని తనతోపాటు పొన్నం ప్రభాకర్ సైతం లేఖలు రాశారని, అయితే రద్దీ, సాంకేతిక కారణాల రీత్యా అది సాధ్యపడలేదన్నారు. వారానికి రెండుసార్లు నడుస్తున్న ఈ రైలును వారానికి 4సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 25 వేల కోట్ల వ్యయంతో 1350 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరిస్తున్నామని, వీటిలో రూ.2 వేల కోట్ల వ్యయంతో ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభించుకోవడం సంతోషదాయకమని అన్నారు. ఏ దేశంలోనైనా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితేనే ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెడతుందని తెలిపారు. ప్రధాని మోదీ ముందుచూపుతో మన దేశంలో రోడ్లు, రైల్వే, ఏవియేషన్ రంగాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారని అన్నారు. మోదీ పట్టుదల, అకుంఠిత దీక్షవల్లే రైల్వే స్టేషన్ల రూపురేఖలన్నీ మారిపోతున్నాయని,
మోదీ పాలనలో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో తెలంగాణలో 20కి పైగా ప్రాజెక్టులు. 2,298 కిలోమీటర్ల మేర పనులు చేపట్టామని, ఒక్క తెలంగాణలోనే 42 వేల 119 కోట్ల రూపాయల విలువైన రైల్వే పనులు ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగు తున్నాయని తెలిపారు. ఈ ఒక్క ఆర్ధిక సంవత్సరంలోనే బడ్జెట్ లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు 5 వేల 337 వేల కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్కు .రూ.27 కోట్లకుపై వెచ్చించి ఆధునీకరణ పనులు పూర్తి చేశామని, ఎయిర్పోర్టును తలపించే విధంగా లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, ఏసీ వెయిటింగ్ హాళ్లు, నాన్ ఏసీ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, టాయిలెట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు, సోలార్ పవర్ ప్లాంట్, రోడ్డు అభివృద్ధి, ప్లాట్ఫారం షెల్టర్ ఏర్పాటు చేశామని వివరించారు. వచ్చే నెలాఖరులోగా ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో ఒక లైన్ ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, హసన్ పర్తి కరీంనగర్ రైల్వే లేన్ ఏర్పాటుకు సంబంధించి సర్వే నిర్వహించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా రూపొందించామని, 61 కి.మీల మేరకు ఈ రైల్వే లేన్ ను నిర్మించడానికి రూ.1480 కోట్లు వ్యయమవుతుందని డీపీఆర్ లో పేర్కొన్నారని దీనిపై అతి త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకోబోతోందని తెలిపారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక హంగులతో రైల్వే స్టేషన్లను ఆధునికరించడం ఎంతో అవసరం అన్నారు. తాను ఎంపీగా ఉన్న సందర్భంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ కోసం కృషిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ నుండి తిరుపతికి నడుస్తున్న రైలు వారానికి రెండుసార్లు మాత్రమే ఉందని, ఈ రైలును కనీసం వారానికి నాలుగు రోజులు నడపాలని కోరారు. అదేవిధంగా కరీంనగర్ నుండి అత్యధికమంది ముంబై, షిరిడి వెళుతుంటారని, వారి అవసరాల దృశ్య కరీంనగర్ నుండి ఆ ప్రాంతాలకు రైలు నడపాలని కోరారు.
………………………………………………………………………………………