
* గాంధీభవన్ కు వచ్చిన మురళి
* భారీ కాన్వాయ్ దేనికి సంకేతం?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వరంగల్ పంచాయతీపై అధిష్ఠానం సీరియస్ గా దృష్టి కేంద్రీకరించింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచు కొస్తున్న వేస్తున్న వేళ నేతల మధ్య విబేధాలను చక్కదిద్దాలని ప్రయత్నిస్తోంది. మంత్రి కొండా సురేఖ(konda surekha) భర్త మురళి చేసిన వ్యాఖ్యలపై జిల్లాలోని సీనియర్ నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దానిపై అధిష్ఠానం దృష్టి సారించింది. క్రమ శిక్షణ కమిటీ ముందుకు వచ్చి, వివరణ ఇవ్వాలని ఇప్పటికే మురళి(Murali)కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈనేపథ్యంలో కొండా మురళి కాసేపటి క్రితం గాంధీభవన్ వచ్చారు. వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి(Kadium Srihari), రేవూరి ప్రకాశ్ రెడ్డి(Revuri Prakash reddy) లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కమిటీ వివరణ అడగనుంది. అయితే కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి ఇద్దరూ కొండా సురేఖ గురించి తప్పుడు ప్రచారం చేశారని, వారిని కూడా క్రమశిక్షణ కమిటీ వివరణ కోరాలని టీపీసీసీకి ఇప్పటికే కొండా సురేఖ అనుచరులు ఫిర్యాదు చేశారు. అలాగే, ఈరోజు గాంధీభవన్ కు ఆయన భారీ కాన్వాయ్ తో రావడం చర్చనీయాంశంగా మారింది. కొండా మురళిమీద వేటువేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పట్టుపడుతున్న నేపథ్యంలో తన బలగం ప్రదర్శించేందుకు మురళి భారీ కాన్వాయ్ తో వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ మురళిపై చర్యలు ఉంటే తగిన విధంగా స్పందించేందుకు మురళి అనుచరులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
……………………………………..