
* ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అలాంటి పనులు వద్దు
* యూరియా కొరతపై బీజేపీ మంత్రులకు, రాష్ట్ర అధ్యక్షుడికీ లేఖలు రాశా
* జూన్లో 45 శాతం యూరియా లోటు
* బీజేపీ నేతలు బాధ్యతలు తీసుకోవాలి
* వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూన్లో 45 శాతం యూరియా లోటు ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం సరఫరాకు, మాటలకు చాలా తేడా ఉందని స్పష్టం చేశారు. యూరియా కొరతపై కేంద్ర మంత్రులు బండి సంజయ్,కిషన్ రెడ్డిలకు కూడా లేఖలు రాశానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దృష్టికి కూడా యూరియా కొరత అంశాన్ని తీసుకెళ్లానన్నారు. యూరియా కొరతకు కాంగ్రెస్ విధానాలే కారణమన్న రామచంద్రరావు వ్యాఖ్యలపై తుమ్మల స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు రైతులకు అన్యాయం చేయవద్దని బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. యూరియా సరఫరాకు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా బాధ్యత తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితోనే రాష్ట్రంలో యూరియా లోటు ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి స్పష్టం చేశారు. ప్రతి నెల రాష్ట్రానికి రావాల్సిన యూరియా సకాలంలో రాకపోవడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఎరువుల సరఫరాపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్రం రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వానకాలం సీజన్కు కేటాయించిందని చెప్పారు. ఏప్రిల్ 2025 నుంచి జూన్ 2025 వరకు మొత్తం 5.00 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ఈ మూడు నెలల్లో రాష్ట్రానికి కేవలం 3.07 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని తెలిపారు. దీంతో మొత్తం 1.93 మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడిందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు సరఫరా పెంచాలంటూ ఇప్పటికీ ఐదుసార్లు లేఖలు రాసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా కేంద్ర మంత్రులను కోరారని గుర్తు చేశారు.
……………………………………….