ఆకేరు న్యూస్, ఆసిఫాబాద్ : పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు తప్పటడుగులు వేశాడు. పీకల దాకా మద్యం సేవించి బుధవారం పాఠశాలకు హాజరయ్యాడు. గ్రామస్తులు,విద్యార్థుల తల్లిదండ్రల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన అధికారులు ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు మండల పరిధిలోని సుకుతుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కొంతకాలం నుంచి మద్యం సేవించి పాఠశాలకు హాజరవుతున్నాడు. పాఠాలు బోధించకుండా, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
……………………………………………………
