
ఆకేరున్యూస్, ఢిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. చాలా రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని 2 రూపాయలు పెంచడంతో.. ఈ పెంపు దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.66, డీజిల్ ధర రూ.95.82గా ఉంది. ఎక్సైజ్ డ్యూటీ పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82కు చేరనుంది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.76, డీజిల్ ధర రూ.97.51గా ఉంది. పెరిగిన ఎక్సైజ్ డ్యూటీతో పెట్రోల్ ధర రూ.111.76, డీజిల్ ధర రూ.99.51 కానుంది. మరోవైపు అమెరికా -చైనా ట్రేడ్ వార్, ఆర్థిక మాంద్యం భయాలు, ఒపెక్ ప్లస్ ఉత్పత్తి పెంపు వంటి అంతర్జాతీయ ఆర్థిక భయాల నేపథ్యంలో కొంతకాలంగా క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వారం వ్యవధిలోనే సుమారు 10 డాలర్ల వరకు తగ్గి.. ఇప్పుడు మూడేళ్ల కనిష్ట సాయికి చేరినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి తగ్గింపు జరగలేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల తగ్గింపు నేపథ్యంలో ఇప్పటికైనా పెట్రోల్ ధరలు తగ్గుతాయేమోనని ఎదురుచూస్తున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంపు పేరుతో షాకిచ్చింది.
………………………………