* జిల్లాను మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలి
* కస్తూరిభా గాంధీ కళాశాల తరగతి గదులు ప్రారంభించిన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: బాలికలు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కస్తూరిబా గాంధీ విద్యాలయాల ఏర్పాటు ఏర్పాటు చేసి విద్యార్థినిలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రతి బాలిక ఉన్నత చదువులు చదవాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రం లోని మాధవరావు పల్లి గ్రామంలో 2 కోట్ల 30 లక్షల నిధులతో నిర్మించిన కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయ తరగతి గదులు, ప్రయోగశాలలను కలెక్టర్ దివాకర్ టిఎస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో బాలికలకు విద్య అవసరం లేదనే సనాత ధర్మం పాటిస్తూ వంటగదిలకే పరిమితం చేశారని, నేడు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని వివరించారు. దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి విద్యా బోధన చేశారని, అప్పటి నుండి ఇప్పటి వరకు మహిళలు విద్యను బోధిస్తున్నారని తెలిపారు. బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఉండాలని ఉద్దేశంతో మహాత్మా గాంధీ సతీమణి కస్తూరిబా గాంధీ పేరుతో పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు ఎంత నేర్చుకున్నామనేది ముఖ్యం కాదని నేర్చుకున్న పరిజ్ఞానాన్ని పదిమందికి తెలపడమే గొప్ప విషయమని అన్నారు. తాను సైతం ప్రభుత్వ హాస్టల్లో ఉండి విద్యను అభ్యసించానని, ప్రతి బాలిక తమ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అందించడం జరుగుతుందని తెలిపారు. రానున్న పదవ తరగతి పరీక్షలలో రాష్ట్రం లో జిల్లాను మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేశామని,
నేడు బాలికలకు నూతన భవనం నిర్మాణంతో తరగతి గదులు, ప్రయోగశాలల అన్ని సమస్యలు తీరిపోయాయని తెలిపారు. విద్యా బోధనలు చేసిన ఉపాధ్యాయురాలు తమ స్వంత పిల్లల లాగానే విద్యను అభ్యసిస్తున్న బాలికలను చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ ఎడ్యుకేషన్ ఇంజనీర్ అరుణ్ కుమార్, డిఈఓ సిద్ధార్థ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

………………………………………..
