
* ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలి
* పోలవరంతో భద్రాచలానికి ముప్పు
* కరకట్టల ఎత్తు పెంచాలి
* సీఎం రేవంత్ ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలి
* తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోలవరంపై రౌండ్ టేబుల్ సమావేశం
* సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణకు కేటాయించాలని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో పోలవరంపై ఏర్నాటు చేసిన జలఖడ్గం రౌండ్ సమావేశంలో కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం శాశ్వత ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని, ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కవిత అన్నారు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. లేదంటే ఎప్పుడైనా భారీ వరదలు వస్తే అన్ని గ్రామాలు మునిగిపోతాయన్నారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందని, ఆ వెయ్యి ఎకరాల దేవుడి మాన్యం ఆంధ్రాకు పోయిందన్నారు. దేవుడేమో తెలంగాణలో ఉన్నాడని.. అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోందన్నారు. దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని, భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలని కవిత అన్నారు. ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ,తెలంగాణ.ఒడిషా చత్తీస్ ఘడ్ సీఎంలతో సమావేశం కానున్నారని, ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఐదు గ్రామాల విలీనంపై ప్రధాని దృష్టికి తీసేకురావాలని కోరారు.
………………………………………………