
ఆకేరున్యూస్, అమరావతి: వైసీపీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక్కొక్కరిగా వైసీపీని వీడుతూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే తుని పట్టణానికి చెందిన ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా.. అదే పార్టీకి చెందిన మరో 10 మంది కౌన్సిలర్లు తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. త్వరలో తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇంత మంది ఫ్యాన్ పార్టీని వీడడంపై జిల్లాలో ఇప్పుడు పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. జిల్లాకు చెందిన మరికొంతమంది ముఖ్య నేతలు సైతం కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్కు పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీ శ్రేణులు కూటమి వైపు చూస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఘోర ఓటమి, జగన్ తీరుపైనా నేతలు, కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది. దీంతో చాలా మంది నేతలు ఆయనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రోజున ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆళ్ల నానికి టీడీపీ కండువా కప్పిన సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన మూడు నెలల క్రితమే వైసీపీకి రాజీనామా చేసి తాజాగా టీడీపీ గూటికి చేరారు.
………………………………………………………………………………