ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని (Justice Girija Priyadarshini) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. 2022 మార్చిలో తెలంగాణ హైకోర్టు (Highcourt) న్యాయమూర్తిగా జస్టిస్ గిరిజా ప్రియదర్శిని బాధ్యతలు చేపట్టారు. గిరిజా ప్రియదర్శిని 1970లో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం (Visakhapatnam) పట్టణంలో అప్పారావు, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. విశాఖపట్నంలోని ఎన్బీఎం లా కాలేజీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసి 1995లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా కోర్టులో ఏడేళ్లు ప్రాక్టీస్ చేసి 2008లో జిల్లా జడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణులై గుంటూరు అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె తరువాత ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడేండ్లు, విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా, 2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్గా పదోన్నతి అందుకొని ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఆ తర్వాత కరీంనగర్ (Karimnagar) జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఆమెను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
…………………………………………..
