ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగర పోలీస్ విభాగంలో పారదర్శకతను పెంచేందుకు మరియు పరిపాలనను మరింత వేగవంతం చేసేందుకు పోలీస్ కమిషనర్ సి.వి. సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 63 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను ఒకేసారి బదిలీ చేస్తూ ఆదివారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.ఫిబ్రవరి 14న జరిగిన ‘పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్’ సమావేశం నిర్ణయం మేరకు ఈ బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా పలువురు ఇన్స్పెక్టర్లకు కీలకమైన పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) బాధ్యతలు అప్పగించారు. మరికొందరిని స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ మరియు క్రైమ్ విభాగాలకు కేటాయించారు.బి. రాంబాబు స్పెషల్ బ్రాంచ్ నుండి చార్మినార్ ఎస్హెచ్ఓగా, ఎం. శ్రీనివాసులు రెడ్డి సైఫాబాద్ నుండి అత్యంత కీలకమైన జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓగా, ఎ. సీతయ్య ఫలక్నుమా నుండి సైఫాబాద్ ఎస్హెచ్ఓగా, ఎస్. కోటేశ్వర రావు ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ నుండి చైతన్యపురి ఎస్హెచ్ఓగా . చాలా కాలంగా వెయిటింగ్లో ఉన్న ఇన్స్పెక్టర్లకు కూడా ఈసారి పోస్టింగ్స్ దక్కాయి. సైబర్ క్రైమ్, స్పెషల్ బ్రాంచ్ వంటి విభాగాల్లో వీరికి బాధ్యతలు ఇచ్చారు. ముఖ్యంగా నగరంలో మహిళా రక్షణ కోసం పనిచేసే షీ టీమ్స్ (SHE Teams) బాధ్యతలను శిరీష రాఘవేంద్రకు అప్పగించడం గమనార్హం.బదిలీ అయిన అధికారులు వెంటనే తమ పాత బాధ్యతల నుండి రిలీవ్ అయ్యి, కొత్తగా కేటాయించిన స్టేషన్లలో లేదా విభాగాల్లో రిపోర్ట్ చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులు కాంప్లయన్స్ రిపోర్ట్ (Compliance Report) సమర్పించాలని ఆదేశించారు.
