
– పసిగట్టకపోతే ప్రమాదాలే
– సామర్థ్యానికి మించితే షార్ట్ సర్క్యూట్
– ఇళ్లు, భవనాల్లో నాణ్యతలేని వైరింగ్తో ముప్పు
– రెండేళ్లకోసారి విద్యుత్ తీగల తనిఖీ తప్పనిసరి
– ఐఎస్ఐ మార్క్ తీగలు, స్విచ్బోర్డులే వాడాలి
– ప్రమాదాలు జరగొద్దు అంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ చార్మినార్ పరిధి గుల్జార్హౌజ్ ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దీనిపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. 17 మంది మంటలకు బలికావడం తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలడమే కారణమని నిర్ధారించారు. వెంటిలేషన్ లేకపోవడంతో పది గదులు గల ఆ ఇంట్లో ఏకంగా 8 గదుల్లో ఏసీలు ఉన్నాయి. ఉక్కబోతకు ఏసీలను విపరీతంగా వాడడం, ఇరుకు గదుల్లోనే కంప్రెషర్లను బిగించడంతో ఒత్తిడికి గురై పేలినట్లు తెలుస్తోంది. ఏసీనే కాదు.. ఇంట్లో వైరింగ్ సరిగాలేకపోయినా, నాణ్యతలేని వైర్లు వాడినా కూడా ప్రమాదాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదాలకు కారణం ఇదే
ఇళ్లలో విద్యుత్ ప్రమాదాల నివారణకు ఎంసీబీలు ఏర్పాటు చేసుకుంటే సరఫరాలో ఎలాంటి హెచ్చుతగ్గులున్నా వెంటనే ఎంసీబీ ట్రిప్పయి కరెంట్ సరఫరా నిలిచిపోతుంది. అందుకే ప్రతి ఇంట్లో ఎంసీబీలు విధిగా ఏర్పాటుచేసుకోవాలని విద్యుత్ ఇంజనీర్లు సూచిస్తున్నారు. నగరంలోని వేలాది భవనాల్లో పాత విద్యుత్ వైరింగ్తో విద్యుత్ వాడుతున్నారు. చార్మినార్, గుల్జార్హౌజ్, బేగంబజార్, సికింద్రాబాద్తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలో ఏసీలు వినియోగిస్తే 6 స్క్వేర్ ఎంఎం కాపర్ వైర్లు వినియోగించాలి. అయితే చాలాచోట్ల పలు ఇళ్లలో 2.5 స్క్వేర్ ఎంఎం కాపర్ వైర్లతో ఏసీలు వాడేస్తున్నారు. సుమారు 15-20 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లో అప్పటి విద్యుత్ డిమాండ్కు అను గుణంగా వైరింగ్ తీసుకుని ప్రస్తుతం రెట్టింపుస్థాయి వినియోగం చేస్తుండడంతో ఇళ్లలోని కరెంట్ తీగలపై అధిక లోడ్ పడి షార్ట్సర్క్యూట్ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ఆ తీగలతో డేంజర్
అత్యధిక సంఖ్యలోని గృహాల్లో ఏళ్ల తరబడి ఒకే వైర్లు వినియోగిస్తుండడంతో వాటిపై లోడ్ పెరిగి ప్రమాదాలకు దారితీస్తుంది. ఇళ్లలో వైర్లు సరిగా ఉన్నాయా, లేదా..? అన్నది ప్రతి రెండేళ్లకు ఒకసారి లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్లతో తనిఖీ చేసుకోవాలని విద్యుత్రంగ నిపుణులు సూచిస్తున్నారు. కానీ 10 ఏళ్లు దాటినా చాలామంది పాత విద్యుత్ వైరింగ్ను పట్టించుకోవడం లేదని, ప్రధానంగా అద్దె ఇళ్లలో ఉండే కొంతమంది వేసవిలో ఏసీలు ఏర్పాటు చేసుకోవడంతో ఒక్కసారిగా లోడ్ పెరిగి రాత్రిళ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ జాగ్రత్తలు మస్ట్
– ప్రతి ఇంటిలో, చిన్న వాణిజ్య భవనాల్లో న్యూట్రల్ పరికరాల కోసం సరిపడినంత ఎర్త్ ఎలక్ర్టోడ్ ఏర్పాటు చేసుకోవాలి.
– విద్యుత్ ఓవర్లోడ్ ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఇంట్లో ఎంసీబీ, ఆర్సీసీబి (మినియేచర్ సర్య్కూట్ బ్రేకర్, రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్)లు ఏర్పాటు చేసుకోవాలి.
– ఐఎస్ఐ, బీఐఎస్ మార్క్ కలిగిన కరెంట్ తీగలు, విద్యుత్ స్విచ్ బాక్సులు మాత్రమే వినియోగించుకోవాలి.
– ఏ వస్తువు వాడేందుకు ఎంత విద్యుత్ అవసరం పడుతుందో తెలుసుకుని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి.
– గృహాలు, కార్యాలయాల్లో విద్యుత్ వాడేందుకు మూడు పిన్నుల ప్లగ్లు, సాకెట్లను మాత్రమే ఉపయోగించాలి. ఒకే స్వీచ్బోర్డుకు ఎక్కువ ప్లగ్లు ఉపయోగించడంతో లోడ్ పెరిగే అవకాశాలుంటాయి.
– ఇళ్లలో కొత్తగా విద్యుత్ ఉపకరణాలు పెట్టేందుకు అవసరమైన కనెక్టడ్ లోడ్ ఉందో లేదో ముందుగా లైసెన్స్ కల్గిన ఎలక్ట్రీషియన్తో తనిఖీ చేయించుకోవాలి.
– గృహాల్లో ఎర్తింగ్ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఏదైనా విద్యుత్ ఘాతమైతే ఎర్తింగ్ ఉన్నకారణంగా ఎంసీబీ ట్రిప్ అవుతుంది.
………………………………………..