
* సీిఎంతో చర్చల్లో రహస్యమేమీ లేదు
* అంతా బహిరంగంగానే సినీ ప్రముఖుల భేటీ
* ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజ్ ఆవేదన
ఆకేరున్యూస్, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. సోమవారం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ… సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంపై మరోసారి స్పందించారు. కేవలం ప్రచారం కోసం, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడారని పేర్కొన్నారు. అటెన్షన్, డైవర్షన్ కోసమే సీఎం పాకులాడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. సినిమా వాళ్లతో సెటిల్ చేసుకొని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందించారు. సిఎం రేవంత్తో జరిగిన సమావేశం అందరికి తెలిసిందేనని అన్నారు.
ఇందులో రహస్యం ఏదీ లేదని అంటూ ట్వీట్ చేశారు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదు.. అందరికీ తెలిసే జరిగిందన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల చిత్రపరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ అభివృద్ధి పయనంలో చిత్రపరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కోరారని తెలిపారు. హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని చిత్రపరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించామని.. అనవసర వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి అని పేర్కొన్నారు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోన్న చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.
………………………………………………..