* ట్రాఫిక్ రూల్స్ వాహనదారుల, ప్రజలు పాటించాలి
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో సమిష్టిగా అందరం కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పిలుపునిచ్చారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జాతీయ రోడ్డు మాసోత్సవం సందర్భంగా రవాణా శాఖ ఆద్వర్యం లో ప్రచురించబడిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీ, పోస్టర్లు, కరపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి ఒకటి నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం జరుగుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ అందరు పాటించేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని వారి తల్లిదండ్రులకు వివరించేలా చూడాలని చెప్పారు. దీని పై ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
నిర్లక్ష్యముగా, అతివేగము, డ్రంకన్ డ్రైవ్, మొబైల్ ఫోను మాట్లాడుతూ వాహనదారులు వాహనాలు నడపవద్దని సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంలో అధికారులు విద్యార్థులను విస్తృతంగా భాగస్వాములు చేయాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్లాక్ స్పాట్స్ వద్ద తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు రవాణా శాఖ పోలీస్ శాఖ సంయుక్తంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ లో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు తప్పకుండా ధరించాలని, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను తీసుకెళ్లాలని చెప్పారు. కండీషన్లో ఉన్న వాహనాలనే నడపాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, ఆర్ డి ఓ వెంకటేష్, ఆర్ టి ఓ శ్రీనివాస్, ఏ.ఎం. వి.ఐ. వినోద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
……………………………………..

