
* ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
ఆకేరు న్యూస్, ములుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, డీపీవో దేవరాజు పేర్కొన్నారు.
శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ ఎస్ బాలుర, బాలికల పాఠశాలలలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కు హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అన్నారు. అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఏవైనా అనుమానాలు, ఇబ్బందులు ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఓటర్లకు ఇబ్బంది ఏర్పడకుండా పోలింగ్ కేంద్రాల్లో సరిపడా స్ట్రాంగ్ రూములు, బ్యాలెట్ బాక్సులు, తాగునీరు, మరుగుదొడ్లు, వీల్ చైర్లు తదితర సౌకర్యాలతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల వేళ పొరపాట్లకు తావివ్వకుండా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ పారదర్శకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
హ్యాండ్ బుక్ లో ఉన్న నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సందేహాలు నివృత్తి చేసుకొని ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా కృషి చేయాలన్నారు. చెక్ లిస్ట్ తయారు చేసుకుని నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు సూర్య నారాయణ, మధుసూదన్, రాజేష్ కుమార్,రవీందర్, శ్రీకాంత్, వెంకటేశ్వర్ రెడ్డి, రమేష్ ,సతీష్, మహేందర్ , మధు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………..