* అపోహలు నమ్మవద్దు – అదనపు కలెక్టర్ ఎన్. రవి
ఆకేరు న్యూస్, కమలాపూర్:
జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని హెచ్పిసిఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్, ఎంజెపి బాలుర గురుకుల పాఠశాలను శనివారం సాయంత్రం అదనపు కలెక్టర్ ఎన్. రవి ఆకస్మిక తనిఖీ చేశారు. శనివారం సాయంత్రం కమలాపూర్ మండల కేంద్రంలోని ఎల్పీజీ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ప్లాంట్కు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, గ్యాస్ ఫిల్లింగ్, సరఫరా ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందనీ, బుకింగ్ చేసుకున్న గృహ వినియోగదారులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా సిలిండర్లను సరఫరా చేస్తున్నామన్నారు.గ్యాస్ కొరత ఉందంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దనీ ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, డిటి సదానందం తదితరులు పాల్గొన్నారు.

ఎంజెపి పాఠశాలలో భోజన నాణ్యత పరిశీలన
అనంతరం కమలాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాల , కళాశాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కిచెన్ షెడ్డును పరిశీలించి, విద్యార్థులకు వండుతున్న భోజన పదార్థాల నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. వంట గ్యాస్ నిల్వలు ఎంతవరకు ఉన్నాయో ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందించాలని సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా సూచించారు.
