* క్యూ లైన్ నిర్మాణంలో వేగం పెంచాలి
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతరకు ముందస్తు మొక్కలు చెల్లించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని, క్యూ లైన్ నిర్మాణాలలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను సూచించారు. శనివారం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం, సెలవు రోజుల లో అధిక సంఖ్యలో భక్తులు ముందస్తు మొక్కలు చెల్లించుకోవడానికి వచ్చే అవకాశం ఉందని , వారికి ఎలాంటి అసౌకర్యం ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మోడల్ క్యూలైన్ నిర్మాణాలు పరిశీలించి పనులలో వేగం పెంచాలని క్యూలైన్లలో ఉండే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని, ఆలయ ప్రాంగణంలోని భారీ రాతి స్తంభాలపై త్వరితగతిన బ్రాకెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ ఫ్లోరింగ్ పనులు వేగంగా పూర్తిచేయాలని, సెంట్రల్ లైటింగ్ స్తంభాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మేడారం జాతర కార్య నిర్వహణ అధికారి వీరస్వామి, ఆర్ అండ్ బి ఈ ఈ సురేష్, తహసిల్దార్ సురేష్ బాబు, సంబంధిత గుత్తేదారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

………………………………………………..

