ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద నిర్మించనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేదతీరే అవకాశం ఉందని, తల్లికి తలవంచందే భక్తులు ముందు కదలరని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
ఆదివారం జిల్లా కేంద్రం లోని ఘట్టమ్మ తల్లి దేవాలయం వద్ద 45 లక్షల రూపాయలతో నిర్మించి తలపెట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను కలెక్టర్ దివాకర్ టి.ఎస్., గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచంద్రర్ లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని,
దీనిలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వివరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు, పర్యాటకులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరమే ముందు సాగుతారని, జాతీయ రహదారి ఆనుకొని ఉన్న గట్టమ్మ తల్లి ఆలయం వద్ద అన్ని సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం భక్తులు సేద తీర్చడానికి అనేక స్థలాలు ఉన్నాయని, నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జికి నిధులు సరిపోను పక్షంలో అదనపు నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………..
