… వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య
ఆకేరు న్యూస్ స్టేషన్ ఘన్ పూర్:
ప్రభుత్వం మనదే.. అధికారం మనదే… అభివృద్ధి చేసే బాధ్యత కూడా మనదేనని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1,12,13,14,15 వార్డులలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటి ఇంటికీ వెళ్లి స్థానిక ప్రజలు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎంపీ కావ్య మాట్లాడుతూ
ప్రభుత్వం మనదే… అధికారం మనదే… అభివృద్ధి చేసే బాధ్యత కూడా మనదేనని వరంగల్ ఎంపీ స్పష్టం చేశారు. కొత్త మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని, అధికారం మన చేతుల్లో ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ పేర్కొన్నారు. ప్రతిపక్షం అభివృద్ధి చేయకపోగా నిధులను దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేసి ఘనపూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. రెండేళ్ల క్రితం ప్రజల ఆశీర్వాదాలతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, రైతు భరోసా, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, విద్యుత్ వంటి మౌలిక వసతుల సమస్యలపై కాంగ్రెస్ అభ్యర్థులకు పూర్తి అవగాహన ఉందని వారిని గెలిపిస్తే మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపించగలమన్నారు. గతంలో కడియం శ్రీహరిని నమ్మి ఓటేసిన ప్రజల విశ్వాసాన్ని ఆయన అభివృద్ధి పనులతో నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. గత పాలకులు మాటలకే పరిమితమైతే, ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన పనులు ప్రజల ముందే కనిపిస్తున్నాయని అన్నారు. ఇప్పటికే స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. కేవలం ఏడాది కాలంలోనే రూ.50 కోట్లతో పనులు చేపట్టడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని చెప్పారు. మరో రూ. 50 కోట్లతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేయాలంటే ఈ ఎన్నికల్లో 18కి 18 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు.
” అవినీతిపరులను పక్కన పెట్టాలి”
… ఎమ్మెల్యే కడియం శ్రీహరి
అభివృద్ధికి అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించుకోవాలన్నారు. ప్రస్తుతం లక్ష్యం ఒక్కటేనని, రూ.100 కోట్లతో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ పట్టణాభివృద్ధికి తన నిధులతోపాటు ఎంపీ నిధుల నుంచి రూ.3.5 కోట్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు వీరసైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ‘చేతి గుర్తు’కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో అభ్యర్థులు సింగపురం దయాకర్, తాటికొండ వినయ్ కుమార్, గట్టు సంగీతా, పెసరు క్రిష్ణవేణి, బొల్లు లక్ష్మీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, వంశీధర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, వెంకన్న, నరేందర్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

……………………………………….
