
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ (NEET UG) ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. ఈ ఏడాది మే 4వ తేదీన దేశ వ్యాప్తంగా నీట్-యూజీ పరీక్షను ఆఫ్లైన్ విధానంలో పెన్ను-పేపర్ విధానంలో 557 నగరాలు, 14 అంతర్జాతీయ నగరాల్లో నిర్వహించారు. మొత్తం 5,453 పరీక్ష కేంద్రాలను ఈ పరీక్ష కోసం కేటాయించారు. ఈ పరీక్షకు 22.7 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ(Telangana)లో 190 కేంద్రాల్లో 72,507 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రంలో 33 ప్రభుత్వ, రెండు డీమ్డ్ యూనివర్సిటీలతో కలిపి 29 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో మొత్తం 8,515 ఎంబీబీఎస్ సీట్లుండగా… అందులో 400 వరకు డీమ్డ్ యూనివర్సిటీల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్షకు 20.8 లక్షల మంది హాజరయ్యారు. గతేడాది ఆ సంఖ్య 23.33 లక్షలుగా ఉంది. ఈ ఏడాది దరఖాస్తు చేసిన వారిలో 91.4 శాతం మంది పరీక్ష రాసినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా, అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.
……………………………………………………….