* ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
* ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా మహారాష్ట్రలోని బోకర్ తాలుకా నాందా గ్రామం వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఘటనలో తెలంగాణ వాసులు ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలజ్ కర్ర వినాయకుడి(Palaj Karra Ganesha) దర్శనానికి నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామం నుంచి 15 మంది భక్తులు మూడు కార్లలో బుధవారం ఉదయం బయలుదేరారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర వినాయకుడిని దర్శించుకున్నారు. సాయంత్రం తిరుగు ప్రయాణం ప్రారంభించారు. మహారాష్ట్రలోని బోకర్ తాలూకా నందా గ్రామం వద్ద రాత్రి వారు ప్రయాణిస్తున్న కారు, రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలైన చేకూరి బుల్లిరాజు (53), సునీత (48), బుల్లిరాజు బావమరిది అర్ధాంగి వాణి (45) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వాహనం నడుపుతున్న గుణం శేఖర్ కు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న నీలిమ కూడా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోకర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
………………………………
